సిద్ధిదేవతా స్థాపనం –
(గమనిక: బియ్యపుపిండి, పసుపు, కుంకుమలతో అష్టదళ పద్మము వేసి, అందులో చెప్పబడిన స్థానములలో రెండు తమలపాకులు వేసి అందులో ఒక వక్క, ఒక ఖర్జూరం ఒక రూపాయి బిళ్ళ వేసి శ్లోకం చదివి అక్షతలు వేయండి)
దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధముగా అడిగెను. “ఓ గురుదేవా! పూర్వము జంభుడను దైత్యుడు దేవతలను ఓడించెనని, తరువాత శ్రీదత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించెనని విన్నాను. అయితే శ్రీదత్తుల వారు అతనితో నిజముగా యుద్ధము చేసెనా లేక యోగబలముచే జయించెనా? నా ఈ సందేహమును నివృత్తిచేసి నాకు జ్ఞానోదయము చేయవలసినది.” అందులకు శ్రీగురు ఈ విధముగా పలికెను. “ఇదే ప్రశ్నను పూర్వము యుధిష్ఠిరుడు వాసుదేవుని అడుగగా, ఆ శ్రీకృష్ణుడు చెప్పినదానిని నీకు చెప్పెద, శ్రద్ధగా వినుము” అనెను.
– దత్త అవతారం –
శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. “బ్రహ్మపుత్రుడైన అత్రి మహాతేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయా గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్త నామముగల మహాత్ముడు పుట్టెను. ఆయన మహాతపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమిమీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని యెరుంగుము. ఆయన భార్య పేరు అనఘా. ఆవిడ ఎల్లపుడు పతిని అనుసరిస్తూ ఉండెను. వారి ఎనిమిది మంది పుత్రులు సర్వబ్రహ్మగుణములు కలిగి ఉండెను. అనఘ విష్ణురూపమని, లక్ష్మీరూపము అనఘా అని తెలుసుకొనుము. అనఘుడు తన భార్యతో కలసి యోగావిద్యను అభ్యసించుచూ ఉండెడివారు.
– జంభాసుర యుద్ధ వృత్తాంతం –
ఇలా ఉండగా, జంభ అను దైత్యునిచే దేవతలు పీడింపబడుట సంభవించినది. బ్రహ్మ వలన లభించిన వరప్రసాదమున జంభుడు, అమరావతికి వెళ్ళి నూరు దివ్యవర్షములు యుద్ధము చేసెను. ఈ సంగ్రామములో పాతళలోకములోని రాక్షసులను కుడా కలిసిరి. అసంఖ్యేయమగు దైత్య దానవ రాక్షస సైన్యముతో యుద్ధము జరుగుచుండెను. వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములు విడిచి పది దిక్కులకు తరిమివేయబడితిరి. ముందువైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండ వెనుకగా జంభ దైత్యుడు వెంబడించుచుండెను. బాణ సంఘాతములతో, గదా ముసల ముద్గరాది ఆయుధములతో దైత్యులు పోరాటము చేయుచుండిరి. అడవిదున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై, మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్ళను, శరములను కురిపిస్తూ వెంబడించెను.
అలా దేవతలు వింధ్యగిరిపై అనఘ మరియు అనఘా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనెను – “ఓ దేవదేవా! జగన్నాథా! శంఖచక్రగదాధరా! పాహి పాహి! ఆపదలో ఉన్న మాకు శరణమును ఇవ్వుము. జంభదైత్యుని చేతిలో మాకు పరాజయము వచ్చినది. మీ చరణ పద్మములు కాక సురులకు, భక్తులకు ఇంకేమియును గతి లేదు. కావున ఓ బ్రహ్మన్! దేవతలమైన మేము మీ ఆశ్రయమునకు వచ్చితిమి.”
వారి ఈ విలాపమును అజుడగు ఆత్రేయ భగవానుడు విని, తన దేవియగు అనఘా వైపు లీలగా చూచెను. విగతజ్వరముతో వచ్చి ఉన్న అందరు దేవతలకు అలాగేయని అనుమతినిచ్చి తుష్టిపరిచెను. ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ ఉన్న బ్రాహ్మణిని (అనఘాదేవిని) చూచి ఆమె అందమునకు పరవశులై, మదము నిండిన చిత్తముతో, ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చెదమని ఎత్తుకుపోసాగిరి.
ఇది గమనించిన దత్తులవారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేసెను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూచి దేవతలు వారిపై ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో, త్రిశూలములతో, గదలతో దేవతలు దాడిచేయుచుండ, ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనము చేసిరి.
అసురులు దేవ శస్త్రములచే, మరియు జంభుడు ఇంద్రునిచే సంహరింపబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరు తమ నిజపురములకు చేరుకొనెను. ఈ మహిమను సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి.”
– కార్తవీర్యార్జున కథ –
శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా పలికెను – “ఆ దత్తులవారు తన కర్మలచేత, మనస్సుచేత, వాక్కుచేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను. ఆ మహాతపశ్శాలి ఊర్ధ్వబాహువులతో కట్టెవలె, ఒక రాయివలె చలనము లేకుండా, నియమములు పాటించుచూ తపస్సు చేయసాగెను. కనులతో భ్రుకుటి మధ్య స్థానమును చూచుచూ మూడువేల దివ్యవర్షములు స్థిరముగ తపస్సు చేయసాగెను.
అలా ఊర్ధ్వరేతస్కుడై, యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్తవీర్యార్జునుడు వచ్చెను. రాత్రింబవళ్లు అలుపులేక వినయముగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను, మానసికముగా చింతన చేయుచూ, సంపూర్ణ నియమములు పాటిస్తూ ఆనందముగా సపర్యలు చేసెను.
అందులకు సంతోషించిన దత్తులవారు ఆతనికి వరములు కోరుకోమని అడుగగా, కార్తవీర్యార్జునుడు నాలుగు వరములు కోరెను. మొదటి వరముగా సహస్రబాహువులును, రెండవ వరముగా అధర్మమార్గమున వెళ్ళకుండా ధర్మము వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును, మూడవ వరముగా పృథివిని మొత్తము ధర్మమార్గమున గెలిచి ధర్మముగా యేలుటయును, నాల్గవ వరముగా సంగ్రామమున మహాయోద్ధుని చేతిలో మాత్రమే వీరమరణము పొందుటయను వరములు కోరెను. అందులకు దత్తులవారు ఆనందముగా వరములనిచ్చి, విస్తారమైన రాజ్యమును, అద్వితీయమగు యోగవిద్యను ప్రసాదించెను.
అటుపిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును, అష్టసిద్ధులను పొంది, ఏడు ద్వీపములు, పర్వతములు కలిగిన పృథివి మొత్తమును తన సహస్రబాహువుల ప్రభావముతో ధర్మముగా జయించెను. అన్ని ద్వీపములలో పదివేల యజ్ఞములు చేయుచూ ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞ వేదికలను స్వర్ణ స్థంభములతో శోభాయమానముగా అలంకరింపజేసెను. గంధర్వులు మరియు అప్సరసల నిత్య గాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను.
ఆ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్తవీర్యుని మించి లోకమున వేరొకరు లేరని అనిపించెను. యజ్ఞములు, దానములు, తపముల చేత విక్రముడివలె ప్రశంసింపబడెను. తన ఖడ్గముతో, శరములతో తన యోగశక్తిచే ఏడు ద్వీపములు తిరుగుచూ చూచుచుండెను. ఆ రాజు ప్రభావము చేత రాజ్యమున ద్రవ్యనష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన రక్షింపబడుచుండిరి. ఎనభైఅయిదు వేల సంవత్సరములు పాలించుచూ ఆ నరాధిపుడు (రాజు) చక్రవర్తివలె పశువులను, క్షేత్రములను, పాలించెను. ఆ అర్జునుడి యోగశక్తి వలన పర్జన్యుడు వృష్టిని ఇచ్చెను (వానలు కురిసెను). తన సహస్ర బాహువులతో సముద్రములను శోషింపజేయు వేయి సూర్యులవలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమును జయించెను.
క్రీడావిలాసమున నర్మదా నదిలో ఎదురీత చేయుచూ నదిని ఆడ్డగింప, ఆతని ధాటికి జలము పీడనమునకు గురి అయి అందమైన స్త్రీ వలె దూరముగా జరిగెను (వెనుకకు ప్రవహించినది). తన సహస్రబాహువుల తాడనము వలన సాగరము అల్లకల్లోలమై, మహాతిమింగిలములు మృతిచెంది, పాతాళమున గల అసురులు నిశ్చేష్టులాయిరి.
రావణుడను వశపరుచుకుని మాహిష్మతిలో బంధించెను. తరువాత పులస్త్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుని విడిచెను. కానీ విడుదల అయిన రావణుడు (అవమానభారముతో) పులస్త్యుని నిందించెను.
ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి (అగ్నిదేవునికి) సప్తద్వీపములలోని పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. ఇటువంటి గుణములు కార్తవీర్యార్జునునకు కేవలము యోగాచార్యుడైన అనఘదేవుని కృప వలన మాత్రమే కలిగెను. అలాంటి యోగి వరము లభించిన కార్తవీర్యుని వలన మర్త్యలోకమున అనఘాష్టమీ వ్రతము ప్రసిద్ధి చెందెను.
– అనఘ నామ వివరణ –
అఘము అనగా పాపము. లోకములో అఘము మూడు విధములుగా కలుగును (చిత్తము, వాక్కు, కర్మలు) అలాంటి అఘమును నాశనము చేయువాడు అనఘుడని తెలుసుకొనుము. అనఘుని విధివిధానమున అర్చించిన అష్టగుణములు, అష్టైశ్వర్యములు కలుగును. అణిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమా, ఈశిత్వ, వశిత్వ, కామావసాయితా అను ఎనిమిది యోగసిద్ధులను అర్చించుట వలన మోక్షలక్షణములు సిద్ధించును. కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. జగత్తును అఘరహితముగా చేయు అనఘుడు (దత్తులవారు) నా అంశయే యని తెలుసుకొనుము.”
– అనఘాష్టమీ వ్రత విధానం –
ఇది వినిన యుధిష్ఠిరుడు ఇటుల పలికెను – “ఓ పుండరీకాక్ష! ఈ సర్వరాజు అయిన (కార్తవీర్య) అర్జునుడు చేసిన వ్రతము యేమిటో, వాటి మంత్రములు, సమయములు, యే కాలమునందు, యే తిథులలో చేయవలెనో నాకు చెప్పుము కేశవ.” అనెను.
అందులకు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను – “మార్గశీర్ష మాసములో కృష్ణ పక్షములో వచ్చు అష్టమి తిథియందు, బహుపుత్రులతో కలిసియున్న అనఘ మరియు అనఘా దంపతులను, ముందుగా శాంతపరిచిన (శుద్ధిచేసిన) భూమిభాగమునందు, అష్టపత్రముల (చిత్రము) యందు కలశములలో గానీ, పద్మములయందు గానీ, లేక దర్భలయందు గానీ స్థాపించి పూజింపవలెను. ముందుగా స్నానమాచరించి, పుష్పములు మరియు సుగంధములతో, విష్ణువును ధ్యానించి, ఋగ్వేదములోని ఋక్కులతో అర్చింపవలెను.
వాసుదేవుని అంశ అయిన అనఘుని, లక్ష్మి అంశ అయిన అనఘాని, హరివంశములో చెప్పబడిన ప్రద్యుమ్నాదులను వారి పుత్రవర్గమని భావించి అర్చింపవలెను.
ముందుగా శూద్రులకు, విప్రులకు నమస్కరించి, ఆ కాలములో లభించు మంచి ఫలములు, కందములు, శృంగాటములు (సింగడులు), రేగులు మొదలగు వివిధ నైవేద్యములను, గంధ, ధూప, దీపాదులతో సమర్పింపవలెను. అటు తరువాత ద్విజులతో, సంబంధీకులతో మరియు బంధువులతో భోజనము చేయవలెను.
వ్రతము చివరిలో కనీసము యే ఒక్కరినైనా ఈ వ్రతము చేయుటకు ప్రేరేపింపవలెను. ఈ వ్రతము ఆజీవనము చేయదగునది అను సత్యమును నేను చెప్పుచున్నాను. కనీసం ఒక సంవత్సరమైనా చేయవలెను. ఆ రాత్రి (భగవత్సంబంధమైన) నటనము, నాట్యము, గానము మొదలగువాటితో జాగరణ చేసి, నవమి నాటి ప్రభాత సమయములో (దేవతా ప్రతిమలను) నీటిలో విసర్జనము చేయవలెను.
ఇట్లు యెవరైతే భక్తి యుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరము చేయునో, వారు సర్వపాపములనుండి విడుదల పొందెదరు. కుటుంబము వర్ధిల్లును. విష్ణువు వారిపట్ల ప్రసీదుడగును. ఏడు జన్మలవరకు ఆరోగ్యము కలిగి, తదుపది పరమ గతిని పొందును.
ఓ కౌంతేయా (ధర్మరాజా) ! అఘమును శమింపు ఈ అనఘాష్టమి వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు, కృతవీర్యుని (కార్తవీర్యార్జునుడు) వలె యశోవంతులగుదురు.”
శ్రీగురువు పలికెను – “దత్త కథనము నీకు చెప్పితిని. జంభుని పరాజితునిజేసి దేవతలకు రక్షణనిచ్చిన కథను, ఆ యోగి యొక్క యోగచర్యలను, అనఘ నామ వివరణము, అనఘుడు సంతోషించి భక్తులకు వరములనిచ్చు వ్రతమును చెప్పియున్నాను.” అని చెప్పి ముగించెను.